కలం, వెబ్డెస్క్: ఎల్ నినో ఎఫెక్ట్తో దేశంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు దక్షిణాదిన వర్షాలు లేక కరువుతో అల్లాడుతుంటే పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ముంబైలో భారీ వర్షాలు, వరదలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో క్లౌడ్ బరస్ట్ (Cloudburst)తో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజౌరీ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో దర్హాల్ నది ఉగ్రరూపం దాల్చింది. నది ఉధృతికి న్యూ బస్ స్టాండ్ బెల్లా ప్రాంతం పూర్తిగా జలమయమైంది.
స్థానికుల ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదకు ఇంట్లో సామగ్రి కొట్టుకుపోయింది. దీంతో సర్వస్వం కోల్పోయామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ వరదల్లో ఓ మహిళ గల్లంతైనట్లు స్థానికులు చెప్తున్నారు. వరద నీరు ఒక్కసారిగా బస్ స్టాండ్ పార్కింగ్ ప్రాంతంలోకి దూసుకురావడంతో అక్కడ పార్క్ చేసిన వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని, నదులు, వాగులు, వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

