కలం, వెబ్ డెస్క్: అమరావతి (Amaravati) లో జగన్నాథ రథయాత్ర చేశామని, ఇక రాజధాని నిర్మాణానికి తిరుగుండదని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. గురువారం అమరావతిలోని వెంకటపాలెంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) కు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. మొదటిసారి అమరావతిలో రథయాత్ర నిర్వహించటం సంతోషంగా ఉందని చెప్పారు. ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రలో అందరం పాల్గొనలేమని, అందుకే అమరావతిలో ఏర్పాటు చేశామని తెలిపారు. అమరావతిలో ప్రతి ఏటా జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తామని ఇస్కాన్ ప్రకటించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇస్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్లు ఎంతో ప్రజా సేవ చేస్తున్నాయని సీఎం అభినందించారు.
మానవ సంబంధాలు తగ్గిపోవడంతో మనుషులపై సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం పడుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. మనుషుల జీవితాల్లో ఒత్తిడి దూరం కావాలంటే ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమని సూచించారు. ఉమ్మడి కుటుంబాలు పెరగాలని, అదే భారతీయ సంప్రదాయమని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకే 5 వేల శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి కాపాడేందుకు ఇస్కాన్ లాంటి సంస్థలతో కలిసి పనిచేస్తామని సీఎం వెల్లడించారు.

