కలం, నిర్మల్ : ప్రభుత్వ శాఖలకు అద్దె వాహనాలు సమకూరుస్తున్న యజమానుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అద్దె వాహనాల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల వద్ద అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్నప్పటికీ గత మూడు సంవత్సరాలుగా అద్దె బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వాహనాల నిర్వహణ, బ్యాంకు ఈఎంఐలు, బీమా, డ్రైవర్ల జీతాలు చెల్లించడం భారంగా మారిందని తెలిపారు. ప్రస్తుతం నెలకు చెల్లిస్తున్న రూ.35 వేల అద్దెను పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా రూ.50 వేలకు పెంచాలని, అద్దె వాహనాల యజమానులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాజశేఖర్, కృష్ణ, ప్రసాద్, వికాస్, గంగాధర్, శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

