కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు (Manuguru) మండలంలో గురువారం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. మండల పరిధిలోని గుట్టమల్లారం వద్ద ఉన్న ఒక కారు షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చాలా వేగంగా విస్తరించడంతో, షెడ్డులో పార్క్ చేసి ఉంచిన వాహనాలకు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా భారీగా అగ్ని జ్వాలలు, దట్టమైన పొగ పైకి ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా తీవ్ర కలకలం రేగింది.
మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై, వాటిని అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే మంటల ఉధృతి విపరీతంగా ఉండటంతో వారి ప్రయత్నాలేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. వాహనాలు పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదం ఎలా సంభవించింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

