కలం, వెబ్ డెస్క్: భారత టీ20 జట్టు ఎంపికలపై మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. యూకే పర్యటనలో భారత్ ముందుగా ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20ల సిరీస్ను 2-0తో కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో 4-0తో ఓటమి పాలైంది. దీంతో జట్టు ప్రదర్శనతో పాటు ఆటగాళ్ల ఎంపికపై కూడా విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా సంజూ శాంసన్, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశి ఎంపిక విషయంలో తరచూ మార్పులు చేయడాన్ని ప్రస్తావించిన కార్తీక్, జట్టు యాజమాన్యం, సెలక్షన్ కమిటీ ఒకే ఆలోచనతో ముందుకు వెళ్లడం లేదనే అభిప్రాయం కలుగుతోందన్నారు. అగార్కర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాలని చూస్తుండవచ్చని, మరోవైపు గంభీర్ మాత్రం ప్రతి సిరీస్లో విజయం సాధించాలని భావిస్తున్నారని కార్తీక్ పేర్కొన్నారు. ఈ భిన్నమైన లక్ష్యాలే ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితికి కారణమై ఉండొచ్చని ఆయన అన్నారు.
భారత్లో బెంచ్ బలం ఎక్కువగా ఉండటంతో రెండు మూడు మ్యాచ్ల్లో విఫలమైనా జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి ఆటగాళ్లపై మరింత ఒత్తిడి పెంచుతుందని కూడా కార్తీక్ అభిప్రాయపడ్డారు. యూకే పర్యటనలో నిరాశాజనక ఫలితాల నేపథ్యంలో భారత టీ20 జట్టు ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ సమీక్షలో జట్టు ఎంపికలు, ఫలితాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

