కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (Andhra Pradesh SIR 2026) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న SIR గడువును జూలై 24 వరకు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
నిజానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ గడువు జూలై 14 (నేటితో) ముగియాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఓటర్ల నమోదు, ఇంటింటి సర్వే డిజిటలైజేషన్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ వంటి పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని.. ఈ ప్రక్రియ గడువును పొడిగించాలని పలు రాజకీయ పార్టీలు కోరాయని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. దీంతో సీఈవో ఈభ్యర్థననను పరిశీలించిన ఈసీ, షెడ్యూల్ను సవరిస్తూ కొత్త టైమ్లైన్ను విడుదల చేసింది.
దీని ప్రకారం.. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్కు జూలై 24 వరకు గడువు ఇచ్చారు. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల కానుంది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల జాబితాపై క్లెయిమ్ లు, అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. ఈ నెల రోజుల వ్యవధిలో కొత్త ఓటు నమోదు, తొలగింపులు, మార్పులు – చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అదనపు గడువును ఉపయోగించుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని, బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు.

