కలం, కరీంనగర్ బ్యూరో: చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipalli Satyam) జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు విజ్ఞప్తి చేశారు.
సోమవారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల మెరుగుదలపై చర్చించారు.
యూరియా కొరత రాకుండా..
వ్యవసాయ సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే కోరారు. విద్య, వైద్యం, రవాణా రంగాల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే వినతిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. చొప్పదండి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు.

