కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఓటరు జాబితా, ఓటు హక్కు, సంక్షేమ పథకాలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు జీవిత విశేషాలపై రచించిన ‘వెంకయ్య నాయకుడు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఓటరు జాబితాలో పేరు లేని వారు నా దృష్టిలో చనిపోయినట్టే. అలాంటి వారికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎందుకు అందించాలి?” అని ప్రశ్నించారు. అలాగే, “ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలలో ఓటు వేయడానికి కూడా ఆసక్తి చూపని వారు సమాజం గురించి ఎలా మాట్లాడతారు?” అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడూ ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకుని ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన సూచించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

