కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో రాజ్కుమార్ అనే మానవమృగం తన భార్య, ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఆరుగురిని కిరాతకంగా హతమార్చడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ లాంటి సైకోయిజం వల్లనే తెలంగాణలో మర్డర్లు జరిగాయని ఆరోపించారు. ఈ మేరకు షాబాద్ మర్డర్ల నిందితుడిని, ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పోల్చారు.
హిట్, రన్ అండ్ ఎస్కేప్ తరహాలో రాష్ట్రంలో వైసీపీ ప్రవర్తన ఉందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏదో ఒక అరాచకం చేసి టీడీపీని ట్రాప్ చేయాలని వైసీపీ చూస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దుర్ఘటనలు సృష్టించి బెంగళూరులో జగన్ దాక్కుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం క్రిమినల్ మనస్తత్వాన్ని సోషల్ మీడియాలో వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి సైకోయిజానికి ఆధ్మాత్మికత, టెక్నాలజీనే పరిష్కారంగా ఉంటుందని సూచించారు.

