కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్ (Shabad) మండలంలో జరిగిన ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దైవాల్గూడ గ్రామంలో రాజ్ కుమార్ అనే పోక్సో నిందితుడు విచక్షణరహితంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. రాజ్ కుమార్పై గతంలో షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. సీఐ, ఎస్సై స్పందించలేదని బాధితుల బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం.. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై రమేశ్ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. సీఐపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నిందితుడి కోసం వెతుకులాట..
ఆరుగురిని హత్య చేసి పారిపోయిన రాజ్ కుమార్ కోసం ఏడు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కారులో నందిగామ వైపు వెళ్లినట్లు గుర్తించి.. అక్కడి పోలీసులను సైతం అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికి అతడు బతికి ఉన్నాడా.. ఎక్కడైనా ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. అనేది ఇంకా తెలియరాలేదు.

