కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో ఇటీవల చోటుచేసుకున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యవహారాలను సమన్వయం చేయడంతో పాటు నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించే లక్ష్యంతో పరిశీలకులను నియమించింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారానికి సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డిని పరిశీలకులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు తుంగతుర్తి కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులపై కూడా పరిశీలకులు దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం ద్వారా వివాదానికి సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను పార్టీ తెలంగాణ అధిష్ఠానం కోరినట్లు తెలుస్తోంది. సంబంధిత నాయకులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, విభేదాలకు దారితీసిన పరిస్థితులను పరిశీలించడం, పరిష్కార మార్గాలను సూచించడం పరిశీలకుల ప్రధాన బాధ్యతగా ఉండనుంది. పార్టీలో క్రమశిక్షణ, సమన్వయానికి పెద్దపీట వేయాలనే అధిష్ఠానం సంకల్పానికి ఈ నియామకం నిదర్శనంగా భావిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరింత ముదరకుండా ముందుగానే పరిష్కరించాలని పార్టీ (Telangana Congress) నాయకత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పరిశీలకుల నివేదిక ఆధారంగా అధిష్ఠానం తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో, ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

