కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై బుధవారం భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శి (కోఆర్డినేషన్) మనోజ్ గోవిల్ అధ్యక్షతన ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్ నుండి కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న నీటిపారుదల, రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడంతో పాటు, పెండింగ్లో ఉన్న సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాలో రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ అంశంపై ఆమె వివరాలు వెల్లడించారు. మిగిలిన భూసేకరణ ప్రక్రియను ఒక నెల రోజుల్లో పూర్తి చేసి, ప్రాజెక్టు పనులు వేగవంతంగా ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓ నవీన్, తదితరులు పాల్గొన్నారు.

