కలం, దమ్మపేట: పోస్ట్ ఆఫీస్ సేవలతోనే (Postal Services) గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పాల్వంచ సబ్ డివిజనల్ తపాలా ఇన్స్పెక్టర్ మాలోత్ వీరన్న అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dummapeta) మండలం లింగాలపల్లి (Lingalapalli) గ్రామ పంచాయతీలో నిర్వహించిన తపాలా సేవల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సురక్షితమైన పొదుపు, బీమా పథకాలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పోస్టాఫీస్లో అందుబాటులో ఉన్న సేవింగ్స్, ఆర్డీ, టైమ్ డిపాజిట్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్, పీపీఎఫ్లతో పాటు ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం ద్వారా మంచి ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ), గ్రామీణ బీమా (ఆర్పీఎల్ఐ) సేవలను వినియోగించుకోవాలన్నారు. వీటితో పాటు ఆధార్ అప్డేట్స్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ), మనీ ట్రాన్స్ఫర్, స్పీడ్ పోస్ట్ సేవలను కూడా సులభంగా పొందవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అప్పారావు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎన్. శ్రీను గ్రామస్థులు పాల్గొన్నారు.

