కలం, వెబ్ డెస్క్ : 2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు (City Sessions Court) గతంలో విధించిన శిక్షలను ఉన్నత న్యాయస్థానం పూర్తిగా సమర్థించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ, 38 మంది నిందితులకు ఉరిశిక్షను, మరో 11 మందికి జీవిత ఖైదును యథాతథంగా కొనసాగిస్తూ తీర్పునిచ్చింది.
ఈ ఘోర ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, ఈ పేలుళ్లలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోర్టు స్పష్టం చేసింది.
గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాదాపు 48 మంది నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం వారి అభ్యర్థనలను తోసిపుచ్చింది. జూలై 26, 2008న గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఈ భీకర వరుస బాంబు పేలుళ్లలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు నిందితులకు కఠిన శిక్షలను ఖరారు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

