కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో వర్షాలకు (Mumbai Rains) ఇప్పటికే రెండు రోజుల క్రితం వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా తాజాగా ఓ భవనం కూలి మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. మాన్ఖుర్ద్లో ఈ విషాదం చోటు చేసుకుంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని పలు పురాతన భవనాలు కూలిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో మాన్ఖుర్ద్ జంతా నగర్లో ఉన్న ఓ భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి పలువురిని రక్షించారు. వర్షాల నేపథ్యంలో అధికారులు స్థానికంగా ఉన్న రెండు పురాతన భవనాలను గుర్తించి ఆదివారం మధ్యాహ్నమే ఖాళీ చేయించారు.
అయితే ఆదివారం రాత్రి కొందరు స్థానికులు ఆ భవనం వద్దకు వచ్చారు. అదే సమయంలో భవనం కుప్పకూలింది. దీంతో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు అక్కడికి వచ్చిన మరో వ్యక్తి కూడా చనిపోయారు. ముంబైలో వర్షాపాతం దాదాపు 300 మి.మీ దాటింది. రోడ్లు, రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. దీంతో అధికారులు రెడ్ అలర్డ్ ప్రకటించారు. ప్రజలు బయటకు వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.

