కలం, వెబ్ డెస్క్ : ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతున్న అండర్-19 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ (Asian Boxing Championships) లో భారత్ శుభారంభం చేసింది. తొలి రోజే భారత బాక్సర్లు చంద్రిక పుజారి, జాయ్శ్రీ దేవి తమ తమ పోటీల్లో విజయం సాధించి తదుపరి రౌండ్కు చేరుకున్నారు. ప్రిలిమినరీ రౌండ్లో బాలికల 51 కిలోల విభాగంలో పోటీ పడిన చంద్రిక పుజారి, మంగోలియాకు చెందిన లఖామ్ సెండ్బాతర్పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అన్ని న్యాయనిర్ణేతలు ఆమెకే అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో 5-0 తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
ఆ తర్వాత జరిగిన బాలికల 54 కిలోల విభాగంలో జాయ్శ్రీ దేవి కూడా అద్భుత ప్రదర్శన చేసింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ నింగ్ హాంగ్పై రెండో రౌండ్లోనే రిఫరీ పోరును నిలిపివేయడంతో జాయ్శ్రీ విజేతగా నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో భారత బాక్సింగ్ సమాఖ్య అండర్-19, అండర్-23 విభాగాల్లో బలమైన జట్టును బరిలోకి దింపింది. రెండు విభాగాల్లోనూ 20 మంది చొప్పున బాక్సర్లు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆసియాలోని అత్యుత్తమ బాక్సర్లతో తలపడేందుకు ఈ ఛాంపియన్షిప్ యువ ఆటగాళ్లకు కీలక వేదికగా నిలుస్తోంది. భారత్ పోరు సోమవారం కూడా కొనసాగనుంది. అండర్-23 విభాగంలో విశ్వనాథ్ సురేశ్, గంగా, సాగర్ జాఖర్, హితేష్ తమ తమ తొలి బౌట్లలో బరిలోకి దిగనున్నారు. తొలి రోజు విజయాల జోష్ను కొనసాగించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

