కలం, నిర్మల్ : భైంసా పట్టణం నుంచి పండరిపూర్ పాదయాత్రకు బయలుదేరిన భక్తులకు శనివారం ఘన స్వాగతం లభించింది. పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) భక్తులను శాలువాలతో సన్మానించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా నియమ నిష్టలతో నిర్వహించే ఈ పాదయాత్ర భక్తి భావనతో పాటు ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తుందని అన్నారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా నిర్వహించే ఈ దిండి యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొనడం దేశంలోనే ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. దిండి పాదయాత్ర భక్తి, క్రమశిక్షణ, సేవా భావం, సామరస్యతకు ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

