కలం, వెబ్ డెస్క్ : బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీలో కొనసాగుతున్న అంతర్గత పోరే ఈ పరిస్థితి రావడానికి కారణమని వెల్లడించారు. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీలోని అధిష్టానం వద్దకు వెళ్లి పరస్పరం ఫిర్యాదులు చేసుకునే విధానం వల్లే జాతీయ కమిటీలో తెలంగాణ నేతలకు చోటు దక్కలేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని పార్టీ నేతల మధ్య ఐక్యత లేదని, అందుకే జాతీయ స్థాయిలో తెలంగాణకు తగిన ప్రాధాన్యం దక్కలేదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విజయాలను వేడుక చేసుకోవడం కాకుండా, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కచ్చితమైన ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ఇకనైనా తెలంగాణలోని బీజేపీ నేతలు విభేదాలు, గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అందరూ కలిసి ఐక్యమత్యంతో పోరాడితేనే కేంద్ర అధిష్టానం పార్టీలోని నాయకులకు తగిన గుర్తింపునిచ్చి, పదవులు కేటాయిస్తుందని చెప్పారు.

