కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, రోడ్లు జలమయలయ్యాయి. ఇక లోనావాలా (Lonavala)లోని భూషి డ్యామ్ (Bhushi Dam) పొంగిపొర్లుతోంది. ఘాట్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. దీంతో మెట్లపై నుంచి భారీగా నీరు ప్రవహిస్తూ కనువిందు చేస్తోంది. దీంతో చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతం మళ్లీ పర్యాటకులతో కిటకిటలాడుతోంది.
డ్యామ్ పొంగిపొర్లుతున్న దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు లోనావాలాకు తరలివస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సమీపంలోని పుణే ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భూషి డ్యామ్ వద్ద భద్రతా చర్యలను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. పర్యాటకుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

