కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం (Aswapuram) మండల కేంద్రంలో శనివారం దొంగలు బీభత్సం సృష్టించారు. దేవుడి దర్శనానికి వెళ్లొచ్చే లోపే ఓ ఇంట్లో రూ. 50 వేల నగదు తీసుకుని ఉడాయించారు. స్థానిక ఉషోదయ స్కూల్ వెనుక వీధిలో తేజావత్ సోమునాయక్ దంపతులు శనివారం దగ్గరలోని ఆలయానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి.
అనుమానంతో సోమునాయక్ లోపలికి వెళ్లి చూడగా, గుర్తుతెలియని దుండగులు అప్పటికే ఇంట్లో బీరువాను పగలగొట్టి రూ.50 వేల నగదు అపహరించుకెళ్లినట్లు గమనించారు. పట్టపగలు, జనసంచారం ఉండే వీధిలో చోరీ జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

