కలం, వెబ్ డెస్క్: ఆహార కల్తీకి (Food Adulteration) పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అన్ని జిల్లాల్లో కల్తీ ఆహార పదార్థాలను నిరంతరం తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో డీజీపీ సీవీ.ఆనంద్, సీఎం సలహాదారు రామకృష్ణారావు తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు.
రెండు విభాగాలు ఒకే చోటకు..
ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ విభాగం, ఆహార భద్రత విభాగం వేర్వరుగా ఉన్నాయి. ఇక నుంచి ఈ రెండింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. తద్వారా, రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వారం రోజుల్లో సిద్ధం చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో అమలు పరచాలని సూచించారు.

