కలం, వెబ్ డెస్క్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట రహదారిపై నిలిపి ఉంచిన తోపుడు బండ్లను మున్సిపల్ కమిషనర్ రవిబాబు శుక్రవారం తొలగింపజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆర్డీవో కార్యాలయంతో పాటు నిర్మల్ అర్బన్, రూరల్ తహసీల్దార్ల కార్యాలయాలు ఇదే ప్రాంతంలో ఉండటంతో జనసంచారం అధికంగా ఉంటుందని తెలిపారు. రోడ్డుపై తోపుడు బండ్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు, కార్యాలయాలకు వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. తమకు అనేక మంది ఫిర్యాదులు చేయడంతో వాటిని తొలగించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రహదారులపై అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

