కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా మిడ్జిల్ (Midjil) గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా, ఇతర ఏర్పాట్లను జోన్-7 జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ (DIG LS Chowhan) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకితో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ప్రజల రాకపోకల మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర బందోబస్తు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.
అనంతరం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

