కలం, నిర్మల్: ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల (Janaki Sharmila) సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం దస్తూరాబాద్ పోలీస్ స్టేషన్ (Dasturabad PS) ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, శాంతి భద్రతల పరిస్థితి, నేరాల దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతి, కమ్యూనిటీ పోలీసింగ్ అమలు తీరును ఆమె సమగ్రంగా పరిశీలించారు.
అనంతరం సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంచాలని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే పోలీస్ సిబ్బంది సంక్షేమం, విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సత్యనారాయణ, ఎస్సై సాయి తదితరులు పాల్గొన్నారు.

