కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్కు ముందు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చెన్నై సూపర్ కింగ్స్లో చేరతాడనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ దీనిపై స్పష్టత ఇచ్చారు. హార్దిక్తో ఎలాంటి ట్రేడ్ చర్చలు జరగలేదని, ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదని తేల్చిచెప్పారు. ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ను తీసుకురావాలని సీఎస్కే ప్రయత్నిస్తోందని, ఈ డీల్లో ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ ప్రచారాన్ని కాశీ విశ్వనాథన్ పూర్తిగా కొట్టిపారేశారు. ప్రస్తుతం జట్టు సీజన్ సమీక్ష కూడా ప్రారంభించలేదని చెప్పారు. మేజర్ లీగ్ క్రికెట్ ముగిసిన తర్వాతే సీఎస్కే సీజన్ సమీక్ష నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నానని, ఈ దశలో ఏ ఆటగాడితోనూ చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. హార్దిక్పై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
సీఎస్కేకు ఆత్మపరిశీలన అవసరం
రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో వరుసగా మూడోసారి ప్లేఆఫ్స్కు చేరడంలో సీఎస్కే విఫలమైంది. జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గాయాలు, జట్టు పునర్నిర్మాణం ప్రభావం చూపడంతో సీజన్ ఆశించిన విధంగా సాగలేదు. అందుకే ముందుగా పూర్తి స్థాయి సమీక్షపై ఫ్రాంచైజీ దృష్టి పెట్టింది.
సీఎస్కే (CSK) ట్రేడ్ రేసులో లేదని స్పష్టత రావడంతో కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ హార్దిక్ కోసం పోటీలో ముందున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. కెప్టెన్సీ అవకాశం కూడా ఈ రెండు జట్లకు అదనపు ఆకర్షణగా మారిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్తో పాటు ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కూ అతను అందుబాటులో ఉండడం లేదు.

