కలం, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో గోదావరి నది నాడు జలకళతో నిండుకుండలా కనిపించేదని.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు నిలవకపోవడం మూలంగా ఎడారిగా మారిందని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బుధవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని గోదావరి నదిని ఆయన పరిశీలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే సింగరేణి పరిరక్షణ సదస్సుకు తరలి వెళ్తున్న హరీశ్ రావుకు గోదావరి నది బ్రిడ్జి వద్ద చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి గోదావరి నదిని పరిశీలిస్తూ… గతంలో గోదావరి నది తీరం పరిస్థితి… ప్రస్తుతం నీరు నిల్వ లేకుండా ఎడారిగా కనిపిస్తున్న దృశ్యాల వివరాలను సేకరించారు. గోదావరి నది ప్రస్తుతం నీరు లేకుండా ఎడారిగా మారిన పరిస్థితుల వివరాలను హరీశ్ రావుకు బాల్క సుమన్ వివరించారు. జులై వచ్చినా ఇప్పటివరకు గోదావరి నదిలో నీరు లేకుండా కనిపిస్తున్న పరిస్థితులతో వ్యవసాయం కష్టంగా మారిందని హరీశ్ రావుకు బాల్క సుమన్ విన్నవించారు.
సుందిళ్ల బ్యారేజీ… కాలేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి బ్యాక్ వాటర్ నిరంతరం నిల్వగా ఉండడంతో నది నిండుగా కనిపించేదని ప్రస్తుతం అది లేకపోవడం వల్ల ఎడారిగా మారడం బాధాకరమని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తోపాటు బీఆర్ఎస్ ప్రతినిధులు ఉన్నారు.

