కలం, స్పోర్ట్స్: ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup) నాకౌట్ మ్యాచ్లో మొరాకో చేతిలో ఓడిపోయిన నెదర్లాండ్స్ (Netherlands) జట్టుకు ఆన్లైన్లో ఘోర అవమానం ఎదురైంది. పెనాల్టీ షూటౌట్లో తప్పు చేసిన ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అసహ్యకరమైన రేసిజం వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ దారుణమైన చర్యను డచ్ ఫుట్బాల్ అసోసియేషన్ (KNVB) తీవ్రంగా ఖండించింది. ర్యాంకింగ్స్లో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న మొరాకో, నెదర్లాండ్స్ మధ్య సోమవారం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది.
నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు జస్టిన్ క్లైవర్ట్, క్వింటెన్ టింబర్, క్రిసెన్సియో సమ్మర్విల్లే పెనాల్టీలను గోల్స్గా మలచడంలో విఫలమయ్యారు. దీంతో మొరాకో 3-2 తేడాతో విజయం సాధించి, ప్రపంచకప్లో తమ కలని సజీవంగా ఉంచుకుంది. ఈ ఓటమి అనంతరం పెనాల్టీలు మిస్ చేసిన ముగ్గురు డచ్ ఆటగాళ్లపై ఆన్లైన్లో రేసిజం దాడులు జరిగాయి. దీనిపై డచ్ ఫుట్బాల్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి ద్వేషపూరిత చర్యలు ఫుట్బాల్ క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ రేసిజం వ్యాఖ్యలపై ఆన్లైన్ వివక్ష నిరోధక విభాగానికి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు బోర్డు తెలిపింది. లీగల్ టీమ్ పరిశీలన తర్వాత నిందితులపై క్రిమినల్ విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఈ సంచలన విజయంతో ముందడుగు వేసిన ఆఫ్రికా దిగ్గజం మొరాకో, శనివారం జరగబోయే రౌండ్ ఆఫ్ 16 పోరులో కెనడాతో తలపడనుంది.

