కలం, వెబ్డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. బోయపాలెం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్తున్న ఓ లారీ రోడ్డుపై ఆగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని మరో లారీ వేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి రెండు లారీలు అక్కడికక్కడే మంటల్లో చిక్కుకున్నాయి.
అందరూ చూస్తుండగానే మంటలు తీవ్రంగా మారి లారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వారు అక్కడి చేరుకొని మంటల్ని అదుపు చేసేలోపే లారీలో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

