కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర వీస్ఫడణతో భేటీ అయ్యారు. ముంబై పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏపీలోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పులుల పునరుద్ధరణ కోసం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరారు. ప్రత్యేకంగా రెండు ఆడ పులులు ఇవ్వాలని కోరగా.. దేవేంద్ర ఫడణవీస్ వెంటనే అంగీకరించడంతో ధన్యవాదాలు తెలిపారు.
పెరగనున్న పులుల సంఖ్య..
మహారాష్ట్ర పులుల రాకతో తూర్పు కనుమల ప్రాంతంలో జీవ వైవిధ్యం పెరిగి, పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీర్ఘకాలంలో అక్కడ పులుల సంఖ్య పెరిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని వివరించారు. వన్యప్రాణులు, జీవ వైవిధ్య పరిరక్షణలో ఏపీ, మహారాష్ట్ర కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. అంగీకరించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ భవిష్యత్తులో అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పరమైన అంశాలను కూడా చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే భుజానికి చికిత్స..
ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ భుజ కండరాల గురించి వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. రొటేటర్ కఫ్ గాయాన్ని గుర్తించిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. త్వరలోనే వస్తానని పవన్ పేర్కొన్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు నెలల కిందటే ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్.. 15 రోజుల పాటు విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మరోసారి శస్త్ర చికిత్సకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో పరిపాలన బాధ్యతలు చక్కపెట్టాకే వెళ్లనున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

