కలం, వెబ్ డెస్క్: యాప్లో యూరియా బుక్ చేసుకున్న రైతులు, తెచ్చుకోవడానికి వెళ్లగా బస్తాలే మాయమైన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి (Machreddy) మండల కేంద్రంలో వెలుగు చూసింది. మాచారెడ్డి ప్రాథమిక సహకార సంఘానికి 440 బస్తాల యూరియా వచ్చిందని యాప్లో నమోదు చేశారు. ఇది గమనించిన 25 మంది రైతులు, 120 బస్తాలను బుక్ చేసుకున్నారు.
అనంతరం సొసైటీ వద్దకు వెళ్లి అడగగా.. ఇచ్చేశామని చెప్పడంతో షాకయ్యారు. అన్ని వందల బస్తాల యూరియా ఎలా మాయమవుతుందని.. ఎవరికీ ఇచ్చారు.. బుక్ చేసుకున్నవారికి ఎందుకు ఇవ్వలేదంటూ సొసైటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
అక్రమంగా అమ్ముకుంటున్నారు..
సొసైటీ అధికారులు, సిబ్బంది కుమ్మక్కై బ్లాక్ మార్కెటింగ్లో యూరియా బస్తాలను అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు. వారి చేతివాటం కారణంగానే బస్తాలు మాయమైనట్లు వివరించారు. వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అలాగే, బస్తాలను అక్రమంగా అమ్ముకుంటున్న సొసైటీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

