కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో జరిగిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజిఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధంకు వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ కలిసి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. వృద్ధులకు ప్రస్తుతం ఉన్న పెన్షన్ను రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు.
మహిళలకు అందిస్తామని చెప్పిన స్కూటీల కోసం మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు..
ఎమ్మెల్యేకు చైర్ పర్సన్ కౌంటర్
దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అపారమైన అప్పులను తీర్చడానికే తమకు ప్రస్తుతం సమయం పడుతోందని , రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకుండా ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేస్తుందన్నారు.
తాము తులం బంగారం హమీ ఇచ్చే సమయంలో తులం బంగారం ధర 30 వేలు 40 వేలు ఉంటే , ఇప్పుడు దాని విలువ మూడు, నాలుగు వంతుల రేట్లు పెరిగిందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన అనేక హామీలను నేరవెర్చలేదని ,ఇలా హామీల గురించి మీరు తవ్వుకుంటూ పోతే, తాము కూడా తవ్వాల్సి వస్తుందని, ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ,అభివృద్ధికి సహకరించాలని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు.
అయితే తాము మాట్లాడలేక కాదు… మాటల పంచాయితీ కోసం కళ్యాణ లక్ష్ద్మీ ,షాదీ ముబారక్ వేదిక కాదని , కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీలను గుర్తు చేయడం ,వాటి అమలు చేయాలని కోరడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఒకే వేదిక మీదుగా ఎమ్మెల్యే , చైర్ పర్సన్ మధ్య నడిచిన విమర్శలతో బీఆర్ఎస్ ,కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేశారు.

