కలం, ఖమ్మం బ్యూరో : సత్తుపల్లి (Sathupalli) నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మరిన్ని నూతన ప్రాజెక్టులను తీసుకొస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఏ అవకాశం వచ్చినా ముందుగా సత్తుపల్లి నియోజకవర్గానికే తీసుకురావడానికి కట్టుబడి ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్తో కలిసి ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కల్లూరులో అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ఆధునిక సమగ్ర (ఇంటిగ్రేటెడ్) సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. వేంసూరులో నిర్మాణంలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభమై స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అలాగే ఖమ్మం– అశ్వారావుపేట పాత రహదారిని నాలుగు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.
రైతుల అభ్యున్నతే సహకార బ్యాంకుల ప్రగతికి పునాది అని, రైతులు ఆదాయం పెంచుకుని తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించినప్పుడే బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన పేర్కొన్నారు. నంతరం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, డీసీసీబీ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని సకాలంలో తిరిగి చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఓ గంగాధర్, బ్యాంక్ సీఈఓ ఎన్. వెంకట ఆదిత్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

