కలం, నిర్మల్ : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో (కేజీబీవీ) విద్యార్థులందరికీ మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి నిర్మల్ రూరల్ మండలం అనంతపేట్ గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పాఠశాల ఆవరణను మొత్తం నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.
వర్షాకాలం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పదవతరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఇప్పటి వారికి చెప్పిన సబ్జెక్టులను అడిగి వాటిల్లో నుంచి పలు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాలను పరీక్షించారు.
విద్యార్థులతో లెక్కలు చేయించారు. సరిగ్గా లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించారు. వసతి గృహంలో వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య ఉందని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగానే, స్పందించిన కలెక్టర్ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

