కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ హామీలపై తరచూ లేఖలు రాసి ప్రశ్నిస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్రావు (Ramchander Rao)కు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీఎం రేవంత్ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే దానికి ముందు కేంద్రంలో పదేళ్ల ముందు అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం దేశానికి, పేద ప్రజలకు ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ప్రశ్నకు మోదీతో సమాధానం చెప్పించాల్సిన బాధ్యత రామచందర్ రావుపై ఉందని మహేశ్ కుమార్ తెలిపారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు 25 కోట్ల ఉద్యోగాలు రావాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేశారని, ఉన్న ఉద్యోగాలు పీకేశారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలుగా సంపన్న వర్గాల కోసమే పని చేసిందని, వారికే వెన్నుదన్నుగా ఉందని ఆరోపించారు. దేశంలో పెరుగతున్న ధరలు, సామాన్యుల కష్టాలపై బీజేపీకి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే దేవుడు, శ్రీరామచంద్రుడు అంటూ మత కలహాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
దేశ ప్రజలు ఇలాంటి రాజకీయాలు కోరుకోవడం లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ నేతల ఆటలు సాగవన్నారు. ఇప్పటి వరకు గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలవరన్నారు. బీజేపీ చీఫ్ వచ్చి మీటింగ్ పెడితే కనీసం రెండు వేల మంది కూడా రాలేదని ఇక ఎన్నికల్లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల వరకు బీజేపీ పరిస్థితి దారుణంగా తయారవుతుందన్నారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పారు. బీజేపీ సర్ పేరుతో కొత్త డ్రామాకు తెర లేపిందని, అర్హత ఉన్న ఓట్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

