కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ (Market Yard) పరిసర ప్రాంతాలు తీవ్ర దుర్గంధంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. యార్డ్కు సమీపంలోని గాంధీనగర్, కావేరి నగర్ కాలనీల ప్రజలు ఈ దుర్వాసన కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్కజొన్న పంటలలో మిగిలిన తాలు, చెత్త ధాన్యాన్ని మార్కెట్ యార్డులోనే వదిలేయడంతో సమస్య ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల వర్షాలు కురవడంతో ఈ వ్యర్థ ధాన్యం పూర్తిగా మురిగి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో సమీప కాలనీల ప్రజలు జీవించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. కొనుగోలు ప్రక్రియ పూర్తైన తర్వాత మార్కెట్ యార్డును శుభ్రం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపినట్లు కాలనీవాసులు విమర్శిస్తున్నారు. వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కోతులకు అడ్డాగా మార్కెట్ యార్డు
ఇక మార్కెట్ యార్డ్ (Nirmal Market Yard) కోతులకు అడ్డాగా మారడం కూడా మరో సమస్యగా మారింది. మిగిలిపోయిన ధాన్యం, చెత్త కారణంగా పెద్ద సంఖ్యలో కోతులు అక్కడికి చేరుతున్నాయి. అవి సమీప కాలనీలలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు తెలిపారు. గత రెండు నెలల్లో స్థానిక కౌన్సిలర్ చొరవతో మూడు సార్లు కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినప్పటికీ, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని వారు చెబుతున్నారు.
మందుబాబులకు ఓపెన్ బార్గా మారిన మార్కెట్ యార్డ్
రాత్రి వేళల్లో మార్కెట్ యార్డ్ మందుబాబులకు ఓపెన్ బార్గా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడ మద్యం సేవించి సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు వంటి వ్యర్థాలను వదిలేయడంతో పరిసరాలు మరింత అపరిశుభ్రంగా మారుతున్నాయి. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి సమయంలో ఎవరు వస్తున్నారు, వెళ్తున్నారు అన్నది తెలియని పరిస్థితి నెలకొంది. మార్కెట్ యార్డులో నెలకొన్న ఈ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి శుభ్రత, భద్రత చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Read Also: అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్కు చిట్ట చివరి స్థానం!
Follow Us On: Instagram

