కలం, కరీంనగర్ (జగిత్యాల): విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని, మరమ్మతు పనులను వేగవంతం చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే (Jagtial MLA) సంజయ్ కుమార్ (Sanjay Kumar) విద్యుత్ అధికారులను ఆదేశించారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను వెంటనే తొలగించాలని అన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, ఖరీఫ్ సాగుకు ఇబ్బంది లేకుండా ఉదయం 3 గంటల వరకు త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలని సూచించారు.
మెడికల్ కాలేజీ చుట్టూ రోడ్డు పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను ఏడాదిగా షిఫ్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, వెంటనే స్తంభాలు తొలగించాలని హెచ్చరించారు. వర్షాకాలంలో ప్రజలకు విద్యుత్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అర్హులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందేలా చూడాలన్నారు. పంట పొలాల్లో, గ్రామాల్లో శిథిలమైన, వంగిపోయిన స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన మార్చాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఈ సుదర్శనం, డీఈ గంగారం, ఏడీఈలు జవహర్ నాయక్, సింధూర్ శర్మ, ఎస్ఏఓ శ్రీనివాస్, ఏఈలు పాల్గొన్నారు.

