కలం, స్పోర్ట్స్ : భారత జిమ్నాస్టిక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా జూనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ జిమ్నాస్ట్లు అదరగొట్టారు. హర్షిత్ దామోదరన్ స్వర్ణ పతకం గెలిచాడు. అక్షత్ బజాజ్ రజతం సాధించాడు. ఒకే ఈవెంట్లో భారత్ గోల్డ్, సిల్వర్ గెలవడం ఆసియా ఛాంపియన్షిప్ చరిత్రలో ఇదే తొలిసారి.
ఈ విజయం భారత జిమ్నాస్టిక్స్కు కొత్త ఆశలు నింపింది. చైనాలోని జున్యిలో జరిగిన జూనియర్ మెన్స్ వాల్ట్ ఫైనల్లో హర్షిత్ 13.649 పాయింట్లు సాధించాడు. స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అక్షత్ 13.433 పాయింట్లతో రజతం గెలిచాడు. ఉజ్బెకిస్తాన్కు చెందిన బేఖ్జాద్ బఖ్తియారోవ్ 13.283 పాయింట్లతో కాంస్యం దక్కించుకున్నాడు.
క్వాలిఫయింగ్లోనే జోరు
హర్షిత్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే అగ్రస్థానంలో నిలిచాడు. అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాడు. తొలి ప్రయత్నంలో హ్యాండ్స్ప్రింగ్ ఫ్రంట్ డబుల్ ట్విస్ట్తో 13.866 పాయింట్లు సాధించాడు. రెండో ప్రయత్నంలో సుకహారా 720ను విజయవంతంగా పూర్తి చేశాడు. మొత్తం 13.649 పాయింట్లతో స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. అక్షత్ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. సుకహారా 720, యుర్చెంకో 720 రూటీన్లను చక్కగా పూర్తి చేశాడు. సగటున 13.433 పాయింట్లు సాధించాడు. రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
చరిత్ర తిరగరాసిన జోడీ
భారత జూనియర్ జిమ్నాస్టిక్స్లో ఇలాంటి విజయం ఇంతకుముందు రాలేదు. ఆసియా జిమ్నాస్టిక్స్ యూనియన్ కూడా ఈ ఫలితాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. జూనియర్ ఫైనల్స్లో భారత్ గోల్డ్-సిల్వర్ ఫినిష్ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని తెలిపింది. దీపా కర్మాకర్, అరుణా రెడ్డి, ఆశిష్ కుమార్, ప్రణతి నాయక్ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. కానీ పురుషుల విభాగంలో స్వర్ణం మాత్రం అందలేదు.
ఆ లోటును హర్షిత్ తీర్చాడు. హర్షిత్, అక్షత్ ఇద్దరూ ఒడిశా ప్రభుత్వ మద్దతుతో శిక్షణ పొందుతున్నారు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే జట్టు విభాగంలో కాంస్య పతకం కూడా గెలిచింది. ఇప్పుడు వ్యక్తిగత విభాగంలో గోల్డ్, సిల్వర్ రావడంతో భారత జిమ్నాస్టిక్స్కు కొత్త ఊపు వచ్చింది. ఇక వీరిద్దరూ 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ల్లో కూడా సత్తా చాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

