కలం, వెబ్ డెస్క్ : సాధారణంగా భూములకు, ఇండ్లకు, వ్యాపార సంస్థలకు, ఇతర వాణిజ్య అవసరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయిస్తుంటారు. అయితే, పెంపుడు కుక్కలకు కూడా రిజిస్ట్రేషన్ (Dog Registration) తప్పనిసరి చేస్తూ గురుగ్రామ్ (Gurugram) మున్సిపల్ కార్పొరేషన్ (MCG) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ కమిషన్ ప్రదీప్ దహియా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల మేరకు మున్సిపల్ పరిధిలోని పెంపుడు జంతువుల యజమానులందరూ తమ కుక్కలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే, కార్పొరేషన్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ టోకెన్లను కుక్కలకు ట్యాగ్ చేయాలి. అయితే, ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయి ఉంటి మరోసారి చేయించుకోవాల్సి ఉంటుంది. గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటిసారిగా 2022 చివరలో పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది.
పెంపుడు కుక్కల యజమానులు నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. కుక్క కాట్లు, పెంపుడు కుక్కల దాడులు, పెంపుడు జంతువులు బహిరంగ ప్రదేశాలలో స్వేచ్ఛగా తిరగడం వంటి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధులు, పార్కులు, గ్రీన్ బెల్ట్లు, మార్కెట్లు లేదా ఇతర బహిరంగ ప్రదేశాలలో పెంపుడు కుక్కలను స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించరాదని స్పష్టం చేసింది. కాగా, ఈ నిబంధనలు అన్ని చోట్ల అమలు చేస్తే పెంపుడు జంతువుల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు తగ్గుతాయి.

