కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండేటి రాముపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ACB) వెల్లడించింది. గతంలో వేములవాడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఆయన సేవా కాలంలో అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు.
జగిత్యాల భవానీనగర్లోని ఆయన అద్దె నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.20.67 లక్షల నగదు, ఎస్బీఐ ఖాతాలో రూ.29.88 లక్షలు, ఆయన తండ్రి యూబీఐ ఖాతాలో రూ.16.77 లక్షల బ్యాంకు నిల్వలు, రూ.11.97 లక్షల విలువైన ఇతర వస్తువులు, నిర్మల్ పట్టణంలో రూ.6.05 లక్షల విలువైన ఓపెన్ ప్లాట్, సిరిసిల్లలో రూ.2.18 లక్షల విలువైన వాణిజ్య స్థలం గుర్తించారు. సోదాల్లో వెలుగులోకి వచ్చిన ఆస్తుల మొత్తం విలువ రూ.87,44,629గా ఏసీబీ పేర్కొంది. స్థిరాస్తుల విలువ పత్రాల విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి ఈ ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, సోదాలు కొనసాగుతున్నాయని, కేసు దర్యాప్తు ప్రగతిలో ఉందని ఏసీబీ వెల్లడించింది.

