కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఎక్సైజ్ ఎస్టీఎఫ్, సీ అండ్ డీ బృందాలు మెరుపు దాడులు చేశాయి. అక్రమంగా గంజాయి రవాణా అవుతోందన్న ముందస్తు సమాచారంతో మోతీ నగర్ వద్ద తనిఖీలు చేశారు. సుమారు రూ. 8 లక్షల విలువైన 15.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ బలగాలు ఖమ్మం రైల్వే స్టేషన్, సమీప ప్రాంతాల్లో నిఘా పెంచాయి. ఈ క్రమంలో మోతీ నగర్ పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించిన సంచులను పరిశీలించారు. అందులో 15.7 కేజీల గంజాయి పట్టుబడింది.
తనిఖీల సమయంలో గంజాయి తరలించిన వ్యక్తులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. దీంతో అన్ క్లెయిమ్డ్ కింద గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు, తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. పరారీలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐలు వెంకటేశ్వర్లు, నాగరాజు వెల్లడించారు.

