కలం, నిర్మల్ : జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బైంసా మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra), ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలను సందర్శించిన అధికారులు, వాటి ప్రస్తుత స్థితిగతులను పరిశీలించారు. మంత్రి పర్యటన సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇళ్ల పంపిణీకి సంబంధించి వివిధ దశలలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గృహ సముదాయాల పరిసరాలలోని అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతకుముందు బైంసా మున్సిపాలిటీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి, మున్సిపల్ కమిషనర్ సిద్ధిఖా కుతిజా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

