కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో భద్రాచలం (Bhadrachalam) లో మూడు రోజుల ‘భూ వరాహ యాగం’ గురువారం ఘనంగా ప్రారంభమైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సమీపంలోని కల్పవృక్ష నరసింహస్వామి ఆలయంలో ప్రముఖ జ్యోతిష్యులు, నృసింహ ఉపాసకులు కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహిస్తున్నారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భద్రాచలం (Bhadrachalam) ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు (MLA Tellam Venkata Rao), భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై యాగాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రైతుల శ్రేయస్సు, ప్రకృతి అనుగ్రహం, రాష్ట్ర ప్రజల సుభిక్షతను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
యాగ నిర్వాహకులు కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఈ భూ వరాహ యాగాన్ని తలపెట్టినట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ యాగంలో రైతుల మేలు కోసం మరిన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగ విశేషాలను తిలకించారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

