కలం, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి 72 సార్లు ఢిల్లీ వెళితే 72 పైసలు కూడా తెలంగాణకు తీసుకురాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి రజనీకాంత్ లాగా నటిస్తే, భట్టి విక్రమార్క కమల్హాసన్ లాగా నటించాడని ఎద్దేవా చేశారు. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేతిలో మోసపోని బాధితులెవరూ లేరని విమర్శించారు. రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఆగమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కార్యకర్తల గౌరవం కాపాడకుండా తప్పు చేసామని అభిప్రాయపడ్డారు. మొత్తం ప్రభుత్వం మీద దృష్టి పెట్టి, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదని చెప్పారు. కొత్త రాష్ట్రం, కొత్త సంసారం కాబట్టి, మన రాష్ట్రం నవ్వే వాళ్ళ ముందు జారిపడొద్దని.. మంచిగా నడిపించాలని ఆలోచన చేసామని అన్నారు. కానీ వచ్చే 5 సంవత్సరాలు అలా ఉండదని.. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండిటినీ మంచిగా చూసుకునే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు రావాల్సిన పదవులు, జరగవలసిన లాభం, కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత తనది అని అన్నారు.

