కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వర్షాలు కురవాలని రేపు నాగార్జున సాగర్లో రాష్ట్ర ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించబోతుంది. కృష్ణా నది ఒడ్డున విజయ విహార్ ప్రాంగణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 3.20 గంటల నుంచి 3.24 గంటల మధ్య పవిత్ర పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టబోతుండగా.. ముఖ్యమంత్రి పాల్గొని వర్షాలు కురవాలని పూజలు చేయనున్నారు.
సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సిద్ధాంతి, అర్చకులు, వేద పండితులతో యాగం జరగబోతుంది. 11 హోమ గుండాలు ఏర్పాటు చేయగా.. రేపు రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో 108 మంది రుత్వికులు, అర్చకులు, వేద పండితులు పాల్గొనబోతున్నారు.
భారీగా పోలీస్ బందోబస్త్..
సీఎం రేవంత్ సహా కీలక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కాబోతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా పది కూంబింగ్ టీంలను రంగంలోకి దించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా వేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పూర్తిగా అధికారిక కార్యక్రమం కావడంతో అనుమతించినవారికి మాత్రమే యాగశాలల్లోకి ప్రవేశం ఉంటుందని అధికారులు వివరించారు. ఉదయం 4.05 గంటల నుంచే యాగ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

