కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా మామడ మండలం కేంద్రంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 10 గొర్రెలు మృతి చెందగా.. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి మేకం ఆశన్న ఎప్పటిలాగే తన ఇంటి వద్ద గొర్రెల మందను ఉంచాడు.
బుధవారం అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా కుక్కలు మందపై దాడి చేసి 10 గొర్రెలను కరిచి చంపగా, మరో 15 గొర్రెలను గాయపరిచాయి. మృతిచెందిన, గాయపడ్డ గొర్రెల విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితుడు కన్నీటి పర్యంతమై తెలిపాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. సమాచారం అందుకున్న పశువైద్య అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన గొర్రెలకు చికిత్స అందించారు.

