కలం, వెబ్ డెస్క్: వెనిజువెలా(Venezuela)లో సంభవించిన భారీ భూకంపం (Earthquake)పై యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఇలాంటి భారీ భూకంపం గతంలో ఎప్పుడూ సంభవించలేదని, ఈ భూకంప ప్రభావానికి పది వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తెలిపింది. అలాగే మృతుల సంఖ్య లక్ష వరకు పెరిగే అవకాశం ఉందని సంచలన ప్రకటన చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వెనిజువెలా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది.
వెనిజువెలా ఉత్తర ప్రాంతంలో ఒకే నిమిషం వ్యవధిలో భారీ తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రత నమోదైంది. దీంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా వందలాది భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ ధృవీకరించారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా మరణాల సంఖ్యను వెల్లడించలేదు. ఈ విపత్తు తీవ్రత చాలా ఘోరంగా ఉంటుందని, మరణాల సంఖ్య 10,000 నుండి లక్ష వరకు పెరిగే అవకాశం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) హెచ్చరించడం తీవ్ర కలకలం రేపుతోంది.
విపత్తు సంభవించిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు కుప్పకూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న ప్రాణాలను రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. మరోవైపు, ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న భవనాలకు దూరంగా సురక్షితమైన ఆశ్రయాల్లో ఉండాలని వెనిజులాలోని యూఎస్ ఎంబసీ భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఘోర విపత్తుపై అంతర్జాతీయంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పలు దేశాధినేతలు వెనిజువెలా ప్రజలకు తమ సంఘీభావం ప్రకటిస్తూ, దేశ ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

