కలం, ఖమ్మం బ్యూరో : వివాహేతర సంబంధం వల్ల భర్తను మానసికంగా వేధించి, అతని ఆత్మహత్యకు కారణమైన భార్యతో పాటు ఐదుగురు నిందితులకు కొత్తగూడెం (Kothagudem) అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు బుధవారం కఠిన జైలు శిక్ష విధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వరావుపేట మండలం పేరాయిగూడెంకు చెందిన తగరం ముత్యాలరావు, భార్య శ్యామల ఆమె ప్రియుడు తగరం వెంకటేశ్వర్ల వేధింపులు తాళలేక 2018 జులై 31న మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా అప్పటి ఎస్సై వేల్పుల వెంకటేశ్వరరావు కేసు నమోదు చేయగా, కోర్టులో నేరం రుజువైంది. న్యాయమూర్తి కవిత వెలువరించిన తీర్పు ప్రకారం… మృతుడి భార్య శ్యామలకు 7 ఏళ్లు, ఆమె ప్రియుడు వెంకటేశ్వర్లుకు 10 ఏళ్లు, బంధువు పుల్లారావుకు 5 ఏళ్లు, రామారావు, నరసింహులకు మూడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష పడింది. నిందితులందరికీ రూ.10 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. నిందితులకు శిక్ష పడేలా శ్రమించిన పీపీలు కె. రాజారావు, పి.వి.డి. లక్ష్మి, కోర్టు కానిస్టేబుల్ బి. నాగేశ్వరరావులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు.

