కలం, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వంతెనపై వాహనం ప్రయాణిస్తుండగానే వంతెన కుప్పకూలిపోయింది. అయితే ఇది మామూలు వంతెన కాదు. సట్లెజ్ నదిపై దాదాపు 190 అడుగుల ఎత్తులో నిర్మించిన బెయిలీ వంతెన (Bailey Bridge). అంత ఎత్తు నుంచి ట్రక్కు నదిలో పడిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్లోని కిన్నౌర్ జిల్లా ఉర్ని ధంక్ సమీపంలో నేషనల్ హైవే పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఇసుక లోడ్తో వెళ్తున్న 10 టైర్ల ట్రక్కు వంతెన దాటుతోంది. ఈ క్రమంలో వంతెన ఒక్కసారిగా నదిలో కుప్ప కూలిపోయింది. అయితే నదిలో నీరు తక్కువగా ఉండటంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్వల్ప గాయాలైన డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ రహదారిలో కొంత సేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల గుండా దారి మళ్లించారు.
ఉర్ని ధంక్ ప్రాంతంలో తరచూ కొండ చరియలు విరిగిపడుతూ ఉంటాయి. దీంతో 2016లో ఈ ప్రాంతంలో బెయిలీ వంతెనను నిర్మించారు. ఈ వంతెన సామర్థ్యం 28 టన్నుల వరకు ఉంటుంది. ప్రమాద సమయంలో ట్రక్కు అంతకంటే ఎక్కువ బరువుతో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. అయితే వంతెన కూలిపోవడానికి ఖచ్చితమైన కారణాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

