కలం, కరీంనగర్ బ్యూరో: గ్రామీణ తపాలా ఉద్యోగులను 8వ వేతన సంఘం పరిధిలో చేర్చాలనే డిమాండ్తో కరీంనగర్లో (Karimnagar) ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తమను రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్డు నిర్దేశించిన సూత్రాల ప్రకారం పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక హెడ్ పోస్టాఫీసు ఎదుట ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. తమకు సీజీహెచ్ఎస్, ఈఎస్ఐ లేదా అందుకు సమానమైన ఆరోగ్య భద్రతా సౌకర్యాలను విస్తరించాలన్నారు. అలాగే గ్రాట్యుటీ మంజూరు చేయాలని కోరారు. సాధ్యం కాని వ్యాపార లక్ష్యాల పేరుతో ఉద్యోగులపై ఒత్తిడి తేవడం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో యూనియన్ డివిజన్ సెక్రటరీ సుధాకర్, కోశాధికారి సుగుణాకర్, ఉపాధ్యక్షుడు ఏల్లన్న, సర్కిల్ ఆఫీస్ బేరర్ లచ్చన్న పాల్గొన్నారు.

