కలం, వెబ్ డెస్క్: తమపై పనిభారం, అధికారుల ఒత్తిడి తగ్గించాలని కోరుతూ నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ ఎదుట ముధోల్కు చెందిన అంగన్వాడీ (Anganwadi) ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించడంతోపాటు అదనపు బాధ్యతలు అప్పగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎల్ఓ విధులు, పల్స్ పోలియో, డ్రై డే లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోందన్నారు. దీంతో విధులపై దృష్టి పెట్టడం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్లలో అవసరమైన యాప్లు డౌన్లోడ్ కాకపోవడం వల్ల పనులు మరింత ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటుతో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పీఎం శ్రీ, ప్రీ ప్రైమరీ స్కూళ్లను తమకే కేటాయించి సేవలను కొనసాగించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

